కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ‘ఆదివాసీ వ్యతిరేకి’ అంటూ బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది. శనివారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బ్యానర్లు కనిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఉన్న ఫొటో కూడా వాటిల్లో ఉన్నాయి. ఒడిశాలోని ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అయితే దీనికి ముందు కాంగ్రెస్, టీఎంసీతోపాటు విపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా వెల్లడించాయి.
మరోవైపు మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీలు కూడా ద్రౌపది ముర్ముకు తాజాగా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ దీనిపై స్పందించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలే దీనికి కారణమని చెప్పారు. ముర్ము పేరును ప్రకటించే ముందు బీజేపీ తమను సంప్రదించి ఉంటే ఆమె ఎంపికను తమ పార్టీ పరిగణించేదని అన్నారు. దీంతో యశ్వంత్ సిన్హాకే తమ మద్దతు అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ‘ఆదివాసీ వర్గం వ్యతిరేకి’ అంటూ బెంగాల్ అంతటా పోస్టర్లను బీజేపీ ఏర్పాటు చేసింది. కాగా, ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. అనంతరం 21న విజేతను ప్రకటిస్తారు.