BJP nepotism | తమ పార్టీలో బంధుప్రీతికి తావు లేదని బీజేపీ నాయకులు చెప్తున్న మాటల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదు. వారసులను రాజకీయాల్లో తేవడం ఏంటంటూ ఒంటికాలిపై లేస్తున్న బీజేపీ నేతలు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన అభ్యర్థులను జాబితాను పరిశీలించాలి. 160 మంది అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేయగా.. వీరిలో 12 మంది అభ్యర్థులు ప్రస్తుత, మాజీ బీజేపీ నేతల బంధువులు ఉన్నట్లుగా స్పష్టమవుతున్నది. ఒక్క రాజ్కోట్ జిల్లాలోనే అత్యధికంగా నలుగురు బంధువులకు టికెట్లు ఇవ్వగా, అహ్మదాబాద్లో ఓ పెద్ద నాయకుడి బంధువును ఎంపిక చేశారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రధాన సిద్ధాంతానికి బీజేపీ రాజీపడినట్లుగా దీన్ని బట్టి స్పష్టమవుతున్నది.
అకోటా నుంచి చైతన్య దేశాయి ( కేంద్ర మాజీ మంత్రి మకరంద్ దేశాయి కుమారుడు) , ఛోటాడేపూర్ నుంచి రాజేంద్ర రథ్వా (ప్రస్తుత ఎమ్మెల్యే మోహన్ సింగ్ రథ్వా కుమారుడు), నరోడా నుంచి డాక్టర్ పాయల్ కుక్రాణి(ప్రస్తుత కౌన్సిలర్ రేష్మా కుక్రాణి కూతురు), రాజ్కోట్ (పశ్చిమ) నుంచి డాక్టర్ దర్శిత షా (ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ పీవీ దోషి మనవరాలు), రాజ్కోట్ (గ్రామీణ) నుంచి భానుబెన్ బబారియా (మాజీ ఎమ్మెల్యే మధుభాయ్ బాబారియా కోడలు), గోండాల్ (రాజ్కోట్) నుంచి గీతాబా జడేజా (మాజీ ఎమ్మెల్యే జైరాజ్ సింగ్ భార్య), సోమనాథ్ నుంచి మాన్సింగ్ పర్మార్ (తలాలా మాజీ ఎమ్మెల్యే గోవింద్భాయ్ మేనల్లుడు), నాండోడ్ (భరూచ్) నుంచి డాక్టర్ దర్శన దేశ్ముఖ్ (బరూచ్ మాజీ ఎంపీ చందూ దేశ్ముఖ్ కుమార్తె), తస్రా నుంచి యోగేంద్ర పర్మార్ (సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సింగ్ పర్మార్ కుమారుడు), జమాల్పూర్ (అహ్మదాబాద్) నుంచి భూషణ్ భట్ (మాజీ మంత్రి అశోక్ భట్ కొడుకు), జెట్పూర్ (రాజ్కోట్) నుంచి జయేష్ రాడాడియా (మాజీ మంత్రి విఠల్ రాడియా కుమారుడు) లకు టిక్కెట్లిచ్చిన బీజేపీ.. తాము బంధుప్రీతినే నమ్ముకుంటామని చెప్పకనే చెప్పింది.
కాగా, పాటిదార్ ఉద్యమ ప్రభావం తమ విజయంపై పడకుండా ఉండేందుకు 40 మంది పాటిదార్లకు సీట్లిచ్చారు. ఎస్టీలకు 24, క్షత్రియులకు 19, ఎస్సీలకు 13, బ్రహ్మణులకు 13, జైనులకు 2 టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హర్దిక్ పటేల్ సహా 20 మందికి ఈ దఫా టికెట్లు దక్కడం విశేషం.