న్యూఢిల్లీ: కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఆ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలంటూ వారికి నోటీసులు అందాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్ సహా తొమ్మిది మంది బీజేపీ ఎంపీలు లోక్సభకు రాజీనామా చేశారు.
కాగా, మధ్యప్రదేశ్కు చెందిన రాకేష్ సింగ్, ప్రతాప్ సింగ్, రితీ పాఠక్, రాజస్థాన్ నుంచి దియా కుమారి, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఛత్తీస్గఢ్ నుంచి గోమతి సాయి, అరుణ్ సావో రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా కూడా ఆ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వీరంతా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలను 30 రోజుల్లోగా ఖాళీ చేయాలని అధికారులు కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.