నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులకు వెన్నదన్నుగా నిలుస్తూ వస్తోన్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరో అడుగు ముందుకేశారు. పంటకు కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సభలో ఓ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఓ బిల్లును తయారు చేశారు. అయితే ఆమోదం కోసం వెయిటింగ్ లిస్టులో ఉంది. పంట ఉత్పాదనకు అయిన ఖర్చులో 50 శాతం పరిహారం కింద తిరిగి రైతుకే చెల్లించాలని ఆ బిల్లులో పొందుపరిచారు. అంతేకాకుండా ఎమ్మెస్పీ ధర కంటే తక్కువ ధరకే రైతు పంటను అమ్మాల్సి వస్తే, ఆ సమయంలో రైతుకు నష్టపరిహారం చెల్లించేందుకు లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయాలని కూడా ఆ బిల్లులో పేర్కొన్నారు.
ప్రస్తుతం 22 పంటలకు కనీస మద్దతు ధర అందుబాటులో ఉంది. చెరుకు పంటకు కూడా న్యాయమైన ధర అందేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ బిల్లు కూడా 22 పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన భద్రత కల్పిస్తుంది. ఈ భద్రత కల్పించేందుకు, అలాగే ఈ నిబంధనలను పాటించని వ్యాపారులకు 6 నెలలు జైలు శిక్ష విధించేందుకు ప్రత్యేకమైన డిపార్టుమెంటును కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
ఏ రైతుకైనా సరే కనీస మద్దతు ధర కన్నా తక్కువగా లభిస్తే, ఎంత తక్కువ లభించిందో అంత నష్టాన్ని పరిహారంగా చెల్లించాలని, ఇలా చెల్లించడం ద్వారా కనీస మద్దతు ధర ఆ రైతుకు కల్పించాలని ఆయన సూచించారు. ఈ బిల్లును ”ఫార్మర్స్ రైట్ టు గ్యారంటీడ్ మినిమమ్ సపోర్ట్ ప్రైజ్ రియలైజేషన్ ఆఫ్ అగ్రి ప్రొడక్ట్ బిల్లు 2021” అన్న పేరుతో పిలుస్తున్నారు. ఎమ్మెస్పీ బిల్లు తయారీలో దీనిని ఓ నమూనాగా తీసుకుంటారని వరుణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్పీని గడువు లోగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఈ బిల్లు చెబుతోంది. ఒకవేళ కనీస మద్దతు ధర లభించకపోతే, ఈ లావాదేవీ జరిగిన వారం రోజుల్లోగా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని వరుణ్ ఈ బిల్లులో పేర్కొన్నారు.