బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ మహిళా ఎంపీ ప్రతిపాదన
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి షాకింగ్ ప్రకటన వెలుగులోకి వచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు మయాంక్ జోషికి లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని ఆమె బీజేపీ అధిష్ఠానాన్ని కోరింది.
ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ కూడా రాసింది. తనకు కొడుకు లక్నో కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని, ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు కుదరవంటే తన కొడుకు కోసం తాను ఎంపీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రీటా తన లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు 12 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాడని, ప్రజలకు సేవ చేస్తున్నాడని ఆమె గుర్తుచేశారు. చాలాకాలం కాంగ్రెస్లో పనిచేసిన రీటా బహుగుణ.. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి యూపీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్సభకు ఎంపిక కావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమె లక్నో మేయర్గా కూడా సేవలందించారు. ఇప్పుడు కొడుకుకు అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. రీటాతోపాటు బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్, కేంద్రమంత్రి కౌశల్ కిశోర్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా తమ పుత్రులకు అసెంబ్లీ టికెట్ల కోసం పావులు కదుపుతున్నారు.