Haryana CM : హర్యానాలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అకస్మాత్తుగా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే బీజేపీ హైకమాండ్ కురుక్షేత్ర ఎంపీ నాయబ్ సింగ్ సైనీని హర్యానా కాబోయే సీఎం గా ప్రకటించడం, ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలుపడం, హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు తమ ఎల్పీ నేతగా నాయబ్ సింగ్ సైనీని ఎన్నుకోవడం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జరిగాయి.
ఈ క్రమంలో హర్యానా కాబోయే సీఎం నాయబ్ సింగ్ సైనీ ఇవాళ మధ్యాహ్నం ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. హర్యానాలో సర్కారు ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని ఆయనను కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల బలం తనకు ఉన్నదని తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఖట్టర్ కూడా నాయబ్సింగ్తోపాటే ఉన్నారు. గవర్నర్ దత్తాత్రేయ సింగ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
దాంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని కొలువుదీర్చే పనిలో బిజీగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నాయబ్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం జరిగిన హర్యానా బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నాయాబ్ సింగ్ సైనీని ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకున్నారు. కాగా, ఈ మీటింగ్లో సైనీ పేరును ప్రతిపాదించగానే మంత్రి అనిల్ విజ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
లోక్సభ ఎన్నికల కోసం జరిగిన సీట్ల పంపకం విషయంలో బీజేపీ, జననాయక్ జనతా పార్టీ మధ్య ఏకాభిప్రాయం కుదరనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, నాయబ్ సింగ్ సైనీ ప్రస్తుతం హర్యానాలోని కురుక్షేత్ర లోక్సభ స్థానం నుంచి ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.