భోపాల్: అధికారంలో ఉన్నవారు ఎవరైనా అణాపైసా లంచం తీసుకున్నా, అవినీతికి పాల్పడిన తప్పని చెబుతారు. అలాంటివి మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి.. వారి పనిపడతాం అంటారు. కానీ.. ఇక్కడో ఎంపీ దానికి విరుద్ధంగా ప్రజలకు హితబోధ చేశారు. ఇంత మొత్తం దాటితే తనకు చెప్పండి, అప్పటివరకు తనవద్దకు రావద్దని, ఆ ఫలానా లోపైతే తప్పేమీ లేదని సలహా ఇచ్చాడు.
మధ్యప్రదేశ్లోని రేవాలో ఓ సమావేశం జరిగింది. దానికి బీజేపీ ఎంపీ అయిన జనార్దన్ మిశ్రా హాజరయ్యారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘మీ సర్పంచ్ రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు. రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి. ఎందుకంటే అతడు రూ.7 లక్షలు ఖర్చు చేస్తేనే ఎన్నికల్లో గెలిచాడు. మరోసారి గెలవాలంటే మరో రూ.7 లక్షలు అవసరమవుతాయి. ఇంకో లక్ష అంటారా దానికి అదనం. అందులో తప్పేమీ లేదు. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడితే ఆ సర్పంచ్పై చర్యలు తీసుకుంటాం’ అని ఉచిత సలహా ఇచ్చాడు.
అంటే ప్రజలు తమకు పనులు కావాలంటే కనీసం రూ.15 లక్షలు జేబులో పెట్టుకొని పోవాలన్నమాట.. !. ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి పాల్పడొద్దని, ప్రజలకు సేవ చేయాలని చెప్పాల్సిన ఎంపీ.. ఫలానా మొత్తం వరకు తీసుకుంటే లంచం లేదా అవినీతికి పాల్పడినట్లు చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు.