అహ్మదాబాద్: బీజేపీకి చెందిన మహిళా ఎంపీ లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు. (BJP MP out of polls) గుజరాత్లోని వడోదరకు చెందిన బీజేపీ ఎంపీ రంజన్బెన్ ధనంజయ్ భట్ను తిరిగి ఆ స్థానం నుంచి రెండోసారి పోటీకి దించాలని బీజేపీ భావించింది. వడోదర అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించింది. అయితే ఆమెను మరోసారి పోటీకి దించడంపై బీజేపీలో వ్యతిరేకత వ్యక్తమైంది. మే 7న పోలింగ్ జరిగే వడోదర లోక్సభ స్థానం నుంచి భట్ను తిరిగి నామినేట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బ్యానర్లు వెలిశాయి.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ రంజన్బెన్ భట్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి సుముఖంగా లేనని పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.
మరోవైపు మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.