లక్నో : యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని లంకిణితో, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఔరంగజేబుతో ఆయన పోల్చారు. బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లలో వందలాది మంది చనిపోయారని సురేంద్ర సింగ్ దీదీపై విరుచుకుపడ్డారు. ఇక తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ను, బాబాయి శివపాల్ యాదవ్ను పార్టీ పదవుల నుంచి తప్పించి సమాజ్వాదీ పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారని అఖిలేష్ యాదవ్పై సురేంద్ర సింగ్ విమర్శలు గుప్పించారు.
అఖిలేష్ యాదవ్ ఔరంగజేబు అడుగుజాడల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. ఔరంగజేబు తన తండ్రి షాజహాన్ను పదవి నుంచి తొలగించిన అనంతరం ఆయనను ఆగ్రా జైలులో పెట్టించాడని బీజేపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాగా, దీదీ, అఖిలేష్ యాదవ్లపై కాషాయపార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.