భోపాల్, ఏప్రిల్ 20 : కరేరాలో తన కుమారుడు రోడ్డు ప్రమాదానికి పాల్పడిన కొద్ది రోజులకే పిచోరే జిల్లా బీజేపీ తొలిసారి ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి ఒక పోలీసు అధికారిని తీవ్రంగా హెచ్చరించడంతో మధ్యప్రదేశ్లో కొత్త వివాదం చెలరేగింది. మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లా కరేరా సబ్డివిజన్ ఎస్డీఓగా పనిచేస్తున్న 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయుష్ జాఖఢ్ను బెదిరించారు. తన కుమారుడు కరేరాకు తిరిగి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తాడని, అతడిని ఆపగల ధైర్యం ఎవరికైనా ఉందా అని లోధి సవాలు విసిరారు. హత్య, హత్యాయత్నం సహా సుమారు నాలుగు డజన్ల క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి ఏప్రిల్ 16న జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి తన కుమారుడు దినేష్ లోధిని ఇటీవల పిలిపించిన ఆయుష్ జాఖఢ్పై బెదిరింపు ధోరణిలో ఒక వీడియోను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఆ ప్రమాదంలో దినేష్ నడుపుతున్న థార్ రాక్స్ వాహనం ముగ్గురు పురుషులు, ఇద్దరు యువతులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈ ఐదుగురు గాయపడ్డారు. మళ్లీ ఇక్కడ కనిపించవద్దని ఎస్ఓడీపీ నా కుమారుడిని బెదిరించారు.
కరేరా మీ అబ్బ సొత్తా అని ఎస్ఓడీపీని అడుగుతున్నా. నా కుమారుడు కరేరాకు తిరిగి వస్తాడు. ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మీ అబ్బకు దమ్ముంటే నా కుమారుడిని ఆపడానికి ప్రయత్నించండి. మా చరిత్రను కూడా ఒకసారి చూడండి. మాపై తప్పుడు ఆరోపణలు చేసినా, అనవసరమైన ఒత్తిడి తెచ్చినా, పక్షపాతంగా విచారణ జరిపినా మేము సహించం. మీకు తగిన సమాధానం కచ్చితంగా ఇస్తాము అని ఆ వీడియోలో లోధి హెచ్చరించారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎస్ఓడీపీని ఆయన డిమాండ్ చేశారు. నిర్దేశించిన సమయం లోగా వివరణ ఇవ్వకపోతే ఎస్డీఓపీ ఇంటిని ఆవు పేడతో నింపేస్తానని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. అయితే దీనిపై ఎస్డీఓపీ జాఖఢ్ వివరణ ఇచ్చారు. విచారణకు సంబంధించి కేవలం సాధారణ విచారణ మాత్రమే జరిగిందని, చెబుతూ ఆధికారి తనపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను ఖండించారు.