న్యూఢిల్లీ, ఆగస్టు 18: 2002లో గుజరాత్లో గోద్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆమె కుటుంబసభ్యులను ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులను విడిచిపెట్టడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దోషులకు దండలు వేసి, స్వీట్లు పంచిపెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఆ దోషులు ‘సంస్కారవంతులు’ అంటూ బీజేపీకి చెందిన గోద్రా ఎమ్మెల్యే బీకే రావుల్జీ సర్టిఫికెట్ ఇచ్చారు.
అత్యాచార దోషులను విడిచిపెట్టేందుకు ఏర్పాటైన ప్రభుత్వ కమిటీలో సీకే రావుల్జీ కూడా సభ్యుడు కావడం గమనార్హం. గురువారం ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దోషులకు మద్దతు పలికారు. ‘వాళ్లు తప్పు చేశారో లేదో నాకు తెలియదు. కొందరు దుర్బుద్ధితో వారిని కార్నర్ చేసి శిక్షించాలని యత్నించారు. వాళ్లంతా జైలులో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు. అందుకే వారు విడుదలయ్యారు’ అని పేర్కొన్నారు. 1992 పాలసీ ప్రకారం వాళ్లను విడుదల చేశామని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నామని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకున్నది.
సుప్రీంకోర్టుకు 6 వేల మంది లేఖలు..
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడిచిపెట్టడంపై ప్రతిపక్షాలు సహా, సామాన్య జనం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా దీనిపై సుప్రీం కోర్టుకు దాదాపు 6 వేల మంది మహిళలు, కార్మికులు, మానవ హక్కుల నేతలు లేఖలు రాశారు. ‘వారిని విడిచిపెట్టడంతో వేరే అత్యాచార బాధితులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారికి న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుంది’ అని వాపోయారు. వారికి తిరిగి శిక్ష పడేలా చేసి, న్యాయవ్యవస్థపై మహిళలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. వారిని అలా వదిలేయడం వల్ల అత్యాచారం చేసే వారికి భయం లేకుండాపోతుందని పేర్కొన్నారు. సహేలీ వుమెన్స్ రిసోర్స్ సెంటర్, గమన మహిళా సమూహ, బెబాక్ కలెక్టివ్, ఆలిండియా ప్రోగ్రెసివ్ వుమెన్స్ అసోసియేషన్ తదితర సంఘాలు సుప్రీంకోర్టుకు లేఖ రాసిన వారిలో ఉన్నాయి. కాగా, దోషుల విడుదలను నిరసిస్తూ పుణేలో పలు మహిళా సంఘాలు గురువారం ఆందోళన చేపట్టాయి.
ఐదు నెలల గర్భవతి..
ఈ ఘటన జరిగినప్పుడు బిల్కిస్ బానో వయసు 21 ఏండ్లు. అప్పటికే ఆమె ఐదు నెల గర్భవతి. అయినా కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఇంకొందరు ఇప్పటికీ మిస్సింగ్. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడిచిపెట్టడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.