పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ఆర్జేడీ రెండు సార్లు సీఎంగా చేస్తే, బీజేపీ ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తెలిపారు. బీజేపీ-జేడీయూ మధ్య 17 ఏళ్ల సంబంధం ఉందన్న ఆయన, తమ పార్టీ ఎవరికీ ద్రోహం చేయలేదన్నారు. అయితే నితీశ్ కుమారే రెండు సార్లు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారని విమర్శించారు. నితీశ్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలని ఆశించారని, దీని కోసం జేడీయూ నేతలు బీజేపీని సంప్రదించారని ఆరోపించారు. నితీశ్ను ఢిల్లీకి పంపితే రాష్ట్రంలో తాను సీఎం కావచ్చని జేడీయూ నేతలు అన్నారని తెలిపారు. ఆ కోరిక నెరవేరనందునే బీజేపీని మరోసారి ఆయన వీడారని విమర్శించారు. ప్రధాని మోదీతోపాటు, ఎన్డీయేను గెలిపించిన బీహార్ ప్రజలను కూడా నితీశ్ కుమార్ అవమానించారంటూ మండిపడ్డారు.
కాగా, మహారాష్ట్రలో శివసేనను మాదిరిగా జేడీయూను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను సుశీల్ మోదీ ఖండించారు. ‘శివసేన మా మిత్రపక్షం కాదు. అక్కడ అధికార పార్టీ. మీరు (జేడీయూ) మా మిత్రపక్షం. మా మిత్రపక్షాలను మేం ఎన్నడూ విచ్ఛిన్నం చేయలేదు’ అని అన్నారు. అయితే లాలూ అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఆర్జేడీని చీల్చేందుకు నితీశ్ కుమార్ కుట్ర పన్నుతారని ఆరోపించారు.
మరోవైపు తేజస్వి యాదవ్తో కలిసి నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వం ఎలా పని చేస్తుందో కూడా తాము చూస్తామని సుశీల్ మోదీ అన్నారు. వచ్చే ఎన్నికలలోపు ఈ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.