UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రులు కాషాయ పార్టీని వీడగా ఆయుష్, ఆహార భద్రత మంత్రి ధరం సింగ్ సైనీ గురువారం బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీని వీడిన తొమ్మిదో ఎమ్మెల్యే ధరం సింగ్ సైనీ కావడం గమనార్హం.
ధరం సింగ్ తొలుత గురువారం ఉదయం తన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కిపంపడంతో పాటు అధికారిక నివాసాన్ని ఖాళీచేయడంతో ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. క్యాబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామతో బీజేపీలో మొదలైన నిష్క్రమణల పర్వం ఆపై ఊపందుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిరువ్యాపారులను నిర్లక్ష్యం చేస్తోందని రాజీనామ చేసిన అనంతరం ధరం సింగ్ ఆరోపించారు.
గత కొద్దిరోజులుగా బీజేపీ ఎమ్మెల్యేలు బ్రజేష్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతి సాగర్, ముఖేష్ వర్మ, వినయ్ సఖ్య పార్టీకి రాజీనామా చేశారు. ఇక ధరం సింగ్ సైనీ స్వామి ప్రసాద్ మౌర్యకు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.