చిక్మగళూరు, అక్టోబర్ 11: కర్ణాటకలో దళితులపై అధికార బీజేపీ నేత అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకొని చెల్లించలేదన్న కక్షతో నాలుగు కుటుంబాలకు చెందిన 16 మందిని జగదీశ గౌడ, అతని కుమారుడు తిలక్ గౌడ ఒకే గదిలో 15 రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. దీంతో ఓ మహిళకు గర్భస్రావమైంది. చిక్మగళూరు జిల్లా జెన్నుగడ్డె గ్రామంలో చోటుచేసుకొన్న ఈ పాశవిక ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మహిళను దవాఖానలో చేర్పించిన ఆమె బంధువులు.. జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేస్తేగానీ బాధితులకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించలేదు.
ఈ నెల 8వ తేదీనే బాధితుల బంధువులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, వారికి బెదిరింపులు రావటంతో ఫిర్యాదును ఉపసంహరించుకొన్నారు. 9వ తేదీన నేరుగా చిక్మగళూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశంతో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను విడిపించారు. జగదీశ గౌడ, తిలక్ గౌడ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళకు దిగటంతో అధికార బీజేపీ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. జగదీశ గౌడకు తమ పార్టీకి ఏ సంబంధం లేదని చిక్మగళూరు బీజేపీ అధ్యక్షుడు వరసిద్ధి వేణుగోపాల్ ప్రకటించారు.