జైపూర్: బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు హిందీ మీడియం స్కూళ్ల ఏర్పాటు గురించి మాట్లాడటాన్ని రాహుల్గాంధీ తప్పుపట్టారు. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో మాట్లాడాలంటే కేవలం హిందీ తెలిస్తే చాలదని అన్నారు. కానీ ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయవచ్చని రాహుల్ చెప్పారు.
తాము పేద రైతులు, కూలీల పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవాలని కోరుకుంటున్నామని, వాళ్లు తమ భాష ద్వారా అమెరికన్లతో పోటీపడి విజేతలు కావాలని ఆశిస్తున్నామని రాహుల్గాంధీ పేర్కొన్నారు. రాజస్థాన్లో కొత్తగా 1700 ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభించడం సంతోషకర పరిణామమని ఆయన చెప్పారు.
అల్వార్లో ఓ సమావేశంలో మాట్లాడిన రాహుల్గాంధీ.. స్కూళ్లలో ఇంగ్లిష్ బోధించడం బీజేపీ నేతలకు ఇష్టం లేదని, కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. పేద రైతులు, కూలీల పిల్లలు ఆంగ్లం నేర్చుకోవడం బీజేపీ నేతలకు ఇష్టం లేదని ఆరోపించారు.