Bjp | యూపీ బీజేపీలో తలెత్తిన ముసలం నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఢిల్లీలో ఓ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. మంత్రి మౌర్యతో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యమేర్పడింది. యూపీలోని ప్రస్తుత పరిస్థితులు, ఆయా నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం, అభ్యర్థుల ఎంపిక, కొత్త నేతలకు టిక్కెట్లివ్వడం లాంటి అంశాలపై ఈ సమావేశం సీరియస్గా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సారి దాదాపు ఓ 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపాలని బీజేపీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీరి స్థానంలో కొత్త వారికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. యోగి ప్రభుత్వంపై ప్రజలెవ్వరూ అసంతృప్తితో లేరని, కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అసంతృప్తితో ఉన్నారన్నది బీజేపీ అధిష్ఠానం మాటగా చెబుతున్నారు.