తిరువనంతపురం : కేరళలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుంటే పినరాయి విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని బీజేపీ నేత కుమ్మనం రాజశేఖరన్ ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కేరళలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని దుయ్యబట్టారు. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తుంటే విజయన్ సర్కార్ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైద్య సాయం, నిధులు అందిస్తున్నా కొవిడ్-19తో సతమతమవుతున్న ప్రజలను కాపాడటంలో కేరళ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలు కరోనాను దీటుగా ఎదుర్కొంటే కేరళ ప్రభుత్వం సమర్ధవంతంగా మహమ్మారిని కట్టడం చేయలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న కొవిడ్-19 కేసుల్లో సగానికి పైగా కేరళలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే.