కోల్కతా: పలు నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న బీజేపీ నేత దుండగుల కాల్పుల్లో (Gunned Down) మరణించారు. పశ్చిమ బెంగాల్లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించే రాజు ఝాపై అనేక కేసులున్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. కాగా, శనివారం రాత్రి రాజు ఝా, తన స్నేహితుడితో కలిసి కారులో హైవేపై కోల్కతా వెళ్తున్నారు. మార్గమధ్యలో ప్రధాన విరామ కేంద్రమైన శక్తిగఢ్ వద్ద ఆగారు. రాజు ప్రయాణించిన కారు హైవేపై నిలిచి ఉండగా దాని పక్కగా మరో కారు ఆగింది. అందులో ఉన్న వ్యక్తులు రాజుతోపాటు అతడి స్నేహితుడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రాజు ఝా మరణించగా, అతడి స్నేహితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి.
కాగా, బీజేపీ నేత రాజు ఝాపై కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి పరిశీలిస్తున్నారు. పారిపోయిన హంతకులతోపాటు వారు ప్రయాణించిన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక వ్యాపారులు, టోల్ ప్లాజాల వద్ద పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ నేత రాజు ఝా, దుండగుల కాల్పుల్లో మరణించడం దురదృష్టకరమని ఎస్పీ కమనశిష్ సేన్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నేత కారు డ్రైవర్ను కూడా ప్రశ్నిస్తామని వెల్లడించారు.