గువహటి : అసోం బీజేపీ నాయకుడు రాజీవ్ బోరో(35)ను ఏనుగులు తొక్కి చంపాయి. గువహటి సిటీ శివార్లలోని రాణి రిజర్వ్ ఫారెస్టులో ఉంటున్న ఏనుగుల మంద.. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చింది. బీజేపీ శక్తి కేంద్ర కన్వీనర్ బోరో నివాసంపై ఏనుగులు దాడి చేశాయి. ఆ ఇంట్లో నిద్రిస్తున్న బోరోను కూడా ఏనుగులు తొక్కడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసు, ఫారెస్టు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బోరో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రాణి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. బోరో మృతి పట్ల పర్యావరణ, అటవీశాఖ మంత్రి పరిమల్ శుక్లబైద్యా సంతాపం ప్రకటించారు.
గత పదేండ్లలో మనునషులు – ఏనుగుల మధ్య జరిగిన సంఘర్షణల్లో 888 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ, వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. సోనిట్పూర్ జిల్లాలో అత్యధికంగా 124 మంది, ఉదల్గురి జిల్లాలో 118, గోల్పారా జిల్లాలో 78 మంది చనిపోయారు. అసోంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో 99 మంది మృతి చెందారు.