అహ్మదాబాద్, జూలై 29: ‘దేశంలోని ప్రతీ ఆడబిడ్డకు సురక్షిత భారతాన్ని అందిస్తా’ చేతికి మైకు దొరికితే చాలు.. ఇలాంటి మాటలతో కాలం వెళ్లిబుచ్చే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో.. ఏకంగా మంత్రినే లైంగికదాడి ఆరోపణలు చుట్టుముట్టాయి. గుజరాత్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అర్జున్సింహ్ చౌహాన్ తన భార్యపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు హల్దర్వాస్ గ్రామానికి చెందిన చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఆరేండ్లలో పలుమార్లు ఆయన లైంగికదాడికి పాల్పడ్డాడు.
కరోనా లాక్డౌన్లోనూ ఆమెను విడిచిపెట్టలేదు. నిర్మానుష్య ప్రాంతంలోని ఓ ఇంట్లో 45 రోజులపాటు నిర్బంధించి ఆమెకు నరకాన్ని చూపించాడు. ‘అధికారం ఉన్నదన్న గర్వంతో అర్జున్సింహ్ 2015 – 2021 మధ్య పలుమార్లు నా భార్యపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మీటింగ్ ఉన్నదని అబద్ధాలు చెబుతూ ఆమెపై ఈ ఘాతుకానికి ఒడిగట్టేవాడు. ఎదురుతిరిగితే బెదిరించేవాడు. కరోనా లాక్డౌన్లోనూ ఆమెను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాలని ఎంత మొత్తుకున్నా.. నిర్మానుష్య ప్రాంతంలోని ఓ ఇంట్లో 45 రోజులపాటు నిర్బంధించి ఆమెకు నరకాన్ని చూపించాడు. పేరున్న ప్రముఖుల దగ్గరికి కూడా వెళ్లాలని ఆమెను బలవంతం చేశాడు. ఆయన ఒత్తిళ్లకు భయపడి ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలి భర్త పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలపై మంత్రి అర్జున్సింహ్ ఇంకా స్పందించలేదు.
అర్జున్సిన్హ్పై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ‘మహిళలను గౌరవించండి (నారీ కో సమ్మాన్దో) అంటూ నినాదాలు చేసిన బీజేపీ నేతలు.. తమ మంత్రి లైంగిక దాడులపై ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నించారు. సోమవారం ఉదయం పార్లమెంట్లో 56 అంగుళాల ఛాతీ కలిగిన వ్యక్తి (ప్రధాని మోదీ) లైంగిక దాడి అంశంపై సమాధానం చెప్పాలని, ఆయన రాకపోతే, నంబర్-2ని (అమిత్ షా) సభకు పంపించాలని డిమాండ్ చేశారు.