కోల్కతా, ఫిబ్రవరి 4: తృణమూల్ను రాజకీయంగా ఎదుర్కొనలేక.. కేంద్రంలోని బీజేపీ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని టీఎంసీ (తృణమూల్) ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. కేంద్ర నిధుల వినియోగానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘యుటిలైజేషన్ సర్టిఫికెట్స్’ సమర్పించటం లేదన్న బీజేపీ నేతల ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా.. దానిని కేంద్రం టార్గెట్ చేస్తున్నదని ఆరోపించారు.
ఆదివారం కోల్కతాలో ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విలేకరులతో మాట్లాడుతూ, ‘రాజకీయంగా తృణమూల్ను ఓడించలేక, రాష్ట్రంలోని పేద ప్రజలపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కాగ్ నివేదిక ప్రకటనలను విపక్షాలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నాయి. వామపక్షాల పాలనలో వైఫల్యాలకు తృణమూల్ బాధ్యత వహించదు. తృణమూల్ ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం వెళ్లింది’ అని చెప్పారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు వేల కోట్ల రూపాయల యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ సమర్పించలేదని తృణమూల్ మరో నేత కాకోలి ఘోష్ దస్తిదార్ గుర్తుచేశారు. రాష్ర్టానికి ఉపాధి హామీ నిధులు విడుదల కావటం లేదని 2022 మే నుంచి కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నామని ఆమె చెప్పారు.