చండీగఢ్, డిసెంబర్ 27: పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 2016 మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు (26కి 20) సాధించి మేయర్ పీఠం దక్కించుకున్న ఆ పార్టీ ఈసారి ఓటమి చవిచూసింది. 35 వార్డులకు గానూ 12 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రస్తుత నగర మేయర్, బీజేపీ సీనియర్ నేత రవికాంత్ శర్మ, మాజీ మేయర్ దవేశ్ మౌద్గిల్ కూడా ఓడిపోయారు. ఈనెల 24న జరిగిన మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తొలిసారి చండీగఢ్ మున్సిపల్ బరిలోకి దిగిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ 14 వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితం కాగా, శిరోమణి అకాలీదళ్ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీ స్థానాలు ఏ పార్టీకి రాలేదు. ఎన్నికల ఫలితాలపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం రాబోవు పంజాబ్ ఎన్నికల్లో మార్పునకు సంకేతమన్నారు.