న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓట్లు కొల్లగట్టాలని చూస్తుంది. కానీ తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని మించి హిందుత్వ కార్డును ప్రదర్శించడానికి ఇతర పార్టీలు ఉత్సాహం చూపాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమ బెంగాల్లో మమత గెలిచినా, తమిళనాట స్టాలిన్ విజయ దుందుభి మోగించినా, కేరళలో కమ్యూనిస్టు పినరయి విజయన్ చరిత్ర సృష్టించినా అందులో హిందుత్వ పాత్రను తీసిపారేయలేం.
పశ్చిమ బెంగాల్లో ఇదే హిందుత్వ కార్డును ప్రయోగించిన బీజేపీకి అదే హిందుత్వతో దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు మమతా బెనర్జీ. పదే పదే ఎన్నికల ప్రచారాల్లో తాను బ్రాహ్మణురాలినని, తన తండ్రి కాళీ మాత గుడిలో పూజారి అని చెప్పుకున్నారు. ఆలయాలను సందర్శించారు. చండీ స్తోత్రాలను ఎన్నికల ప్రచారాల్లో చదివారు. చివరికి తనది శాండిల్య గోత్రం అని కూడా చెప్పుకున్నారు. ఇలా బీజేపీ హిందుత్వను ఆమె విజయవంతంగా హైజాక్ చేయగలిగారు.
అటు కేరళలో బీజేపీ ఈసారి శబరిమల అయ్యప్పను నమ్ముకుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో అక్కడి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడి ఎన్నికల ప్రచారాల్లో స్వామియే శరణం అయ్యప్ప నినాదాలు చేశారు. ఆలయంలోకి ఆడవారికి ప్రవేశం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం స్వాగతించడంతో ఈ అంశాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా భావించింది. ఆ అయ్యప్ప స్వామితోపాటు భక్తులు కూడా విజయన్కు తగిన గుణపాఠం చెబుతారని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల అన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే అంతటి నాస్తికుడు విజయన్ కూడా పోలింగ్ రోజున అయ్యప్ప ఆశీర్వాదాలు తమకే ఉంటాయని చెప్పడం విశేషం.
తమిళనాట స్టాలిన్ పరిస్థితి కూడా ఇలాంటిదే. మొదటి నుంచీ డీఎంకేపై హిందుత్వ వ్యతిరేక ముద్ర ఉంది. ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్నాడీఎంకే, బీజేపీ కూటమి భావించింది. దీంతో తమ పార్టీ హిందూ వ్యతిరేకి కాదు అని స్టాలిన్ పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. తన భార్య కూడా గుడికి వెళ్తుందని, డీఎంకేలో ఎంతో మంది దేవుడిని నమ్ముతారని, తానెవరికీ అడ్డు చెప్పనని స్టాలిన్ చెప్పుకున్నారు. అంతేకాదు డీఎంకే మ్యానిఫెస్టోలో దేవాలయాల నిర్వహణకు ప్రత్యేకంగా రూ.1000 కోట్లను కూడా కేటాయించడం విశేషం. ఇలా బీజేపీ హిందుత్వ కార్డును హైజాక్ చేయడంలో మమత, విజయన్, స్టాలిన్ ఒక రకంగా విజయవంతమయ్యారనడంలో సందేహం లేదు.