న్యూఢిల్లీ: వచ్చే వారం గుజరాత్ అసెంబ్లీ రద్దవుతుందా? అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరిపేందుకు ప్రకటన వెలువడనున్నదా? అని ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సందేహాలను బయటపెట్టారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు, అక్కడ తమ ఉనికిని విస్తరించుకోవడానికి ఆప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ‘గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి, వచ్చే వారం ఎన్నికలను ప్రకటించాలని బీజేపీ యోచిస్తోందా? ఆప్ అంటే నిజంగా వారి భయం పట్టుకుందా?’ అని ట్వీట్టర్ హ్యాండిల్లో రాశారు.
ఢిల్లీలో మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. భవిష్యత్లో మరిన్ని రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆదివాసి సంకల్ప్ మహాసమ్మేళనానికి హాజరయ్యేందుకు కేజ్రీవాల్ శనివారం సూరత్కు వచ్చారు. భారతీయ ట్రైబర్ పార్టీ (బీటీపీ) చీఫ్ చోటు వాసవా, ఎమ్మెల్యే ఆయన కుమారుడు కూడా అయిన మహేష్ వాసవాతో కలిసి బరూచ్లో దివారం ఈ సమ్మేళనాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించింది. ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో గుజరాత్లో కేజ్రీవాల్ పర్యటించడం ఇది రెండోసారి కాగా, దక్షిణ గుజరాత్, వడోదర ప్రాంతానికి రావడం ఇది తొలిసారి.
ఏప్రిల్ మొదట్లో అహ్మదాబాద్లో చేపట్టిన రోడ్షోలో పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో ఆప్ పోటీ చేసినప్పటికీ ఖాతా తెరువలేకపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో సూరత్ మునిసిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో 27 వార్డులు గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీ 93 వార్డులను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్కు నిరాశే మిగిలింది.