కాంగ్రెస్ సీనియర్ నేత దినేశ్ గుండూరావు
బెంగళూరు: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాది క్యాండిడేట్లను ఖరారు చేయడంలో తీరికలేకుండా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దినేశ్ గుండూరావు బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. యూపీ బీజేపీ.. నేరగాళ్లు, అత్యాచారాలు చేసేవాళ్లు, లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లకు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తున్నదని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధికంగా మహిళలకే అసెంబ్లీ టికెట్లు ఇస్తున్నదని, వారిలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి కూడా ఉన్నదని దినేశ్ గుండూరావు చెప్పారు. దినేశ్ గుండూరావు ప్రస్తుతం గోవా, తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. బీజేపీ అవినీతి రహితులకే టికెట్లిస్తామని చెబుతూనే నేరచరిత్ర కలిగిన వాళ్లకు ఇస్తున్నదని విమర్శించారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వివిధ నేరాల్లో బాధితులుగా ఉన్నవారికి టికెట్లు ఇచ్చి మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పక్షపాతిగా ఉంటుందని చెప్పారు.