భోపాల్: బీజేపీ జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఒక గుర్రానికి ఆ పార్టీ జెండా రంగులు వేశారు. దీంతో మేనకా గాంధీకి చెందిన ఎన్జీవో సంస్థ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర కేబినెట్లో ఇటీవల కొత్తగా చేరిన కేంద్ర మంత్రులను ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసేందుకు జన ఆశీర్వాద్ యాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 22 రాష్ట్రాల మీదుగా ఇది సాగనున్నది.
కాగా, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ఈ యాత్ర సాగింది. ఈ నేపథ్యంలో మాజీ మున్సిపల్ కార్పొరేటర్ రాందాస్ గార్గ్ అద్దెకు తెచ్చిన ఒక గుర్రానికి బీజేపీ జెండా రంగులతో పెయింట్ వేశారు. పార్టీ కండువాను దాని మెడకు కట్టారు. ఇండోర్లో నిర్వహించిన బీజేపీ జన ఆశీర్వాద్ యాత్రలో దీనిని ప్రదర్శించారు.
మరోవైపు బీజేపీ నాయకురాలు మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) ఎన్జీవో సంస్థకు చెందిన స్థానిక ప్రతినిధులు దీనిపై ఇండోర్ సంయోగితగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారు.