పట్నా : పరిస్థితుల ప్రభావంతో సీఎం కాగలిగారని బిహార్ సీఎం నితీష్ కుమార్ పై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తున్నా పాండే ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పాండే మాట్లాడటంతో కాషాయ పార్టీ ఆయనపై వేటు వేసింది. నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా పాండే చేసిన వ్యాఖ్యలపై బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
నితీష్ పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన పాండేకు అంతకుముందు పార్టీ క్రమశిక్షణ కమిటీ చీఫ్ వినయ్ సింగ్ నోటీసులు జారీ చేశారు. కాగా బిహార్ ఓటర్లు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తే అందుకు విరుద్ధంగా నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారని పాండే వ్యాఖ్యానించారు. ఇక బిహార్ లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) సర్కార్ కు బీజేపీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.