న్యూఢిల్లీ: ఢిల్లీ ఎల్జీ సక్సేనా, కేజ్రీవాల్ సర్కారు మధ్య మరో వివాదం నెలకొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం గురువారం కౌన్సిలర్ల తొలి సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా బీజేపీ కౌన్సిలర్ను నియమిస్తూ ఎల్జీ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. సీనియర్ కౌన్సిలర్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించడం సంప్రదాయమని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. రాజ్యాంగ సంప్రదాయాలను, సంస్థలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకునేందుకు కావాల్సిన సీట్లను ఆప్ గెలుచుకుంది. మొదట మేయర్ పదవికి పోటీ పడబోమన్న బీజేపీ.. ఆ తర్వాత మాట మార్చి అభ్యర్థిని నిలిపింది.