రాయ్పూర్: కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ దాదాపు వారం రోజుల సమయం తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు బీజేపీ నేతలైతే అదీ కాంగ్రెస్ పనితనం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సీఎంలను మార్చారో, ఎప్పుడు ఎంత సమయం తీసుకున్నారో వివరంగా చెప్పారు.
ఉత్తరాఖండ్లో బీజేపీ నేతలు ముఖ్యమంత్రిని మూడుసార్లు మార్చిన విషయాన్ని బఘేల్ గుర్తుచేశారు. గుజరాత్లో కూడా వాళ్లు ఎన్నిసార్లు సీఎంను మర్చారో తెలియదా..? అని మీడియాను ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్కు చెందని ఓ బీజేపీ నేతను జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎంపిక చేయడానికి బీజేపీ నేతలు ఏకంగా 8 రోజుల సమయం తీసుకున్నారని విమర్శించారు.
కాగా, ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నెల 13న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ కంటే 22 సీట్లు ఎక్కువగానే దక్కించుకుంది. అయితే, సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గట్టిగా పోటీపడటంతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారిలో ఒకరి పేరును ప్రకటించడానికి దాదాపు వారం రోజుల సమయం పట్టింది. ఆఖరికి సిద్ధరామయ్యనే సీఎం పదవి వరించబోతున్నది. డీకేకు డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు.