లక్నో: అమ్మేందుకే ఎయిర్పోర్టులను బీజేపీ నిర్మిస్తోందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేయడంపై ఆయన ఈ మేరకు ఎద్దేవా చేశారు. లక్నోలోని చౌదరి చరణ్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఎస్పీ మిత్రపక్షమైన జన్వాది పార్టీ (సోషలిస్ట్) నిర్వహించిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘ఒకవైపు కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తూ.. మరోవైపు ఉన్న ఎయిర్పోర్టులను అమ్ముతున్నారు. దీనిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. బీజేపీని ఎలా నమ్మాలి? ’ అని అఖిలేష్ ప్రశ్నించారు. లక్నో విమానాశ్రయాన్ని గతంలో ఓ ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘పేదలు చెప్పులు తొడుక్కుని విమానంలో ప్రయాణిస్తారని బీజేపీ చెబుతోంది. ఎంతమంది విమానాల్లో ప్రయాణించారో పేదలు బీజేపీకి తెలియజేయాలని’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ ప్రభుత్వం విమానాశ్రయాలను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైందని అఖిలేష్ విమర్శించారు. ఢిల్లీ విమానాశ్రయం కూడా నష్టపోతున్నప్పుడు కొత్తగా నిర్మించే ఈ విమానాశ్రయం వల్ల ఎవరు లాభపడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మే దేశంలో ప్రజల హక్కులు, గౌరవం ఏమైపోతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.