న్యూఢిల్లీ: గోవాలో మిగిలిన ఆరు స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ మేరకు ఆరుగురు అభ్యర్థుల పేర్లతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. దాంతో గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. గతంలోనే 34 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది.
గోవా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి ఎప్పుడూ పోటీచేసే స్థానమైన పనాజీని తనకు కేటాయించాలని కోరారు. కానీ బీజేపీ ఆయన కోరికను లెక్కచేయకుండా పనాజీ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇచ్చింది. ఆ మేరకు 34 మంది అభ్యర్థులతో తొలిజాబితాను వెల్లడించింది.
మిగిలిన ఆరు స్థానాల్లో ఉత్పల్ పారికర్కు రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీచేయాలని ఉత్పల్ పారికర్కు సూచించింది. అయితే, తాను కోరిన పనాజీ కాకుండా వేరే స్థానాలను ఆఫర్ చేయడంతో నిరాశకు లోనైన ఉత్పల్ బీజేపీని వీడి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు స్థానాలకు కూడా బీజేపీ ఇవాళ అభ్యర్థులను ఖరారు చేసింది.