Supriya Sule : ఆమె అక్రమ బిట్కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఎన్సీపీ నాయకురాలు (NCP leader) సుప్రియా సూలే (Supriya Sule) కొట్టిపారేశారు. బీజేపీ వెల్లడించిన ఆడియో క్లిప్స్లో ఉన్నది తన వాయిస్ కాదని, అదంతా బీజేపీ కుట్ర అని ఆమె చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సుప్రీయా సూలే మీడియాతో మాట్లాడుతూ.. బిట్ కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్ నోట్స్, సందేశాలన్నీ నకిలీవని అన్నారు.
కావాలనే బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని సూలే విమర్శించారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి పోలీసులు తనను అరెస్టు చేయరనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశానని, తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎంపీ సుధాంశు త్రివేదికి పరువునష్టం దావా నోటీసులు పంపానని వెల్లడించారు. ఈ విషయంపై ఎక్కడ సమాధానం చెప్పేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఈ ఆరోపణలపై ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. తన సోదరి సుప్రియా వాయిస్ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. ఆడియో క్లిప్లలో ఆమె వాయిస్ డబ్బింగ్ చేసినట్లుగా లేదని.. దీనిపై విచారణకు మద్దతిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తన కుమార్తెకు మద్దతు ఇస్తూ.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయగల సామర్థ్యం కేవలం బీజేపీకి మాత్రమే ఉందని విమర్శించారు.
మంగళవారం బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆడియో క్లిప్లను వినిపించారు. సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మాజీ పోలీసు కమిషనర్, ఇతరులతో కలిసి అక్రమ బిట్కాయిన్ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ పోలీసు అధికారి, డీలర్కు మధ్య జరిగిన చాట్ల స్క్రీన్షాట్లను కూడా చూపించారు. ఎన్నికల ఫలితాలను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడికి అనుకూలంగా మార్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.