పట్నా: ఓ ఐపీఎస్ అధికారి తన సీనియర్ అధికారికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. అది అధికారిక నియమావళికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని నేరుగా మాట్లాడుకోవాలని, అంతే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.
‘ఉద్యోగంలో ఉన్న ఏ అధికారి అయినా తన పని ట్వీట్లు చేయడం కాదనే విషయం తెలుసుకోవాలి. ఇలా ట్వీట్లు చేయడమనేది చాలా చెత్త విషయం. వారికి ఏదైనా సమస్య ఉంటే డిపార్టుమెంటుకుగానీ, పై అధికారులకుగానీ ఫిర్యాదు చేయాలి. నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అంతేతప్ప పబ్లిసిటీ చేయకూడదు. చట్టం ఇదే చెప్తుంది’ అని నితీశ్కుమార్ వ్యాఖ్యానించారు.
తాను హోమ్గార్డ్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఐజీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డీజీ ర్యాంక్ అధికారిణి శోభా అహోత్కర్ తనను నిత్యం వేధిస్తున్నదంటూ ఐజీ వికాస్ వైభవ్ చేసిన ట్వీట్కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో ఐజీ వికాస్ వైభవ్కు బీహార్ పోలీస్ డిపార్టుమెంట్ షోకాజ్ నోటీస్ జారీచేసింది.
వికాస్ వైభవ్ ట్వీట్.. ఆలిండియా సర్వీస్ కాండక్ట్ రూల్స్-1968లోని రూల్ 3కి విరుద్ధమని షోకాజ్ నోటీసులలో పేర్కొన్నారు. డీజీ వేధింపులకు సంబంధించిన కాల్ రికార్డులు ఉన్నాయనడంపై షోకాజ్ నోటీసులలో తప్పుపట్టారు. పోలీస్ ఉన్నతాధికారుల సమావేశానికి సంబంధించిన సంభాషణలను రహస్యంగా రికార్డు చేయడం రూల్స్ విరుద్ధమని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఇవాళ సీఎం నితీశ్కుమార్ ముందు ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఘటనపై విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు.