పాట్నా : బిహార్లో 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం తన అధికారిక నివాసం మైదానంలో మహోగని మొక్కను నాటి ఈ డ్రైవ్ను ప్రారంభించారు. ఇదే సమయంలో పలు ఎన్జీవో సంస్థలు, పారా మిలటరీ దళాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాయి.
జల్ జీవన్ హరియాలి కార్యక్రమంలో భాగంగా 2021-22లో నితీష్ కుమార్ ప్రభుత్వం బిహార్లో 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. ఇందుకోసం అటవీశాఖ 5.5 కోట్ల మొక్కలను సిద్ధం చేస్తుంది. వీటిలో అటవీశాఖ 1.24 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు 2 కోట్లు, జీవికా వాలంటీర్లకు 1.50 కోట్లు, మరో 50 లక్షల మొక్కలను రైతులకు పంపిణీ చేయనున్నారు. 20 లక్షలకు పైగా మొక్కలను ఎన్జీవోలు, వివిధ బోర్డులు, క్లబ్బులు, కేంద్ర పారామిలిటరీ దళాలు నాటనున్నాయి. మొబైల్ వ్యాన్ల ద్వారా మరో 15 లక్షల మొక్కలు పౌరులకు అందుబాటులో ఉంచబడతాయి.