న్యూఢిల్లీ: ఆయుర్వేద ఉత్పత్తులు, వైద్య చికిత్సలు అందించే పతంజలి సంస్థ నకిలీ వెబ్సైట్లను కొందరు రూపొందించారు. వీటి ద్వారా జనాన్ని మోసగిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నితిన్ శర్మ అనే వ్యక్తి తన కుమారుడికి ఆయుర్వేద చికిత్స కోసం ఇంటర్నెట్లో వెతికాడు. పతంజలి సంస్థ యోగ్ గ్రామ్ నకిలీ వెబ్సైట్లో పేర్కొన్న మొబైల్ నంబర్ను కాంటాక్ట్ చేశాడు. డాక్టర్ సునీల్ గుప్తా అనే వ్యక్తి మాట్లాడాడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద పది వేలు కట్టించుకున్నాడు. అనంతరం పతంజలి సంస్థ తరుఫున చికిత్స పేరుతో పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. రూ.2,40,500లు చెల్లించిన నితిన్ శర్మకు ఆ వెబ్సైట్పై అనుమానం వచ్చింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మొబైల్ నంబర్ సిమ్ కార్డును కోల్కతాలో కొన్నట్లు గుర్తించారు. ఆ నంబర్ను బీహార్లోని నలందాలో వినియోగిస్తున్నట్లు సాంకేతికంగా తెలుసుకున్నారు. అలాగే శర్మ చెల్లించిన డబ్బులను పశ్చిమ బెంగాల్లోని పలు ఏటీఎంల నుంచి విత్డ్రా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో బీహార్లోని నలందాకు చెందిన 25 ఏళ్ల హరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు హరేంద్రను ప్రశ్నించగా వారు చేస్తున్న మోసం గురించి వెల్లడించాడు. దీంతో నలందలోని గిరియాక్లో 31 ఏళ్ల రమేష్ పటేల్, 22 ఏళ్ల ఆషిశ్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. వెబ్సైట్ డెవలపర్ అయిన హరేంద్ర, ప్రజలను మోసగించేందుకు యోగ్ గ్రామ్ను పోలిన నకిలీ వెబ్సైట్లు సృష్టించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 20 నకిలీ వెబ్సైట్లను బ్లాక్ చేసేందుకు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాకు ఆ వివరాలు పంపినట్లు వెల్లడించారు.