Tejashwi yadav: బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్పై ఆర్జేడీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ చలోక్తులు విసిరారు. అసెంబ్లీలో నితీశ్ సర్కారు బలపరీక్ష సందర్భంగా విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో తేజస్వియాదవ్ చమత్కారంగా మాట్లాడారు. సీఎం నితీశ్ కుమార్కు తనను తాను మేనల్లుడిగా చెప్పుకుంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సభలో నితీశ్కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని మేం మా కుటుంబంలో ఒకరుగా భావిస్తున్నాం. మనమంతా సమాజ్వాది కుటుంబానికి చెందిన వాళ్లం. అందుకే.. దేశవ్యాప్తంగా మోదీని నిలువరించడానికి మీరు ఎత్తిన జెండాను బీహార్లో మీ ఈ మేనల్లుడు మోస్తాడు. బీహార్లో మోదీని నిలువరిస్తాడు’ అని నవ్వుతూ వ్యాఖ్యలు చేశారు. తనను తాను నితీశ్కుమార్కు మేనల్లుడిగా చెప్పుకున్నాడు.
అదేవిధంగా జేడీయూ ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తుంటే తనకు బాధగా ఉందని తేజస్వి వ్యాఖ్యానించారు. రేపు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు నితీశ్ కుమార్ ఒకే టర్మ్లో మూడు సార్లు ఎందుకు ప్రమాణస్వీకారం చేశాడని అడిగితే ఏం సమాధానం చెప్తారు..? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీని విమర్శించిన మీరు ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ఏం జవాబిస్తారు..? అని నవ్వుతూనే ప్రశ్నలు వేశారు. ‘మేమైతే.. ఉద్యోగాలు భర్తీ చేశాం అని చెప్పుకుంటాం’ అన్నారు.
కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. నితీశ్ పార్టీ జేడీయూకు 43 స్థానాలే వచ్చినా.. 74 స్థానాల్లో గెలిచిన బీజేపీ నితీశ్ను సీఎంను చేసింది. అయితే తర్వాత బీజేపీతో విభేదించిన నితీశ్.. ఆర్జేడీ (75), కాంగ్రెస్ (19) నేతృత్వంలోని మహాకూటమిలో చేరి మరోసారి సీఎంగా కొత్త సర్కారును ఏర్పాటు చేశారు. తాజాగా మహాకూటమికి టాటా చెప్పి మళ్లీ ఎన్డీఏలో చేరడంతో మరోసారి కొత్త సర్కారు కొలువుదీరింది. మళ్లీ నితీశే సీఎం అయ్యారు. ఒకే టర్మ్లో నితీశ్ ఇలా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.