పట్నా: బీహార్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, నితీశ్ తొలగిపోవడం ఖాయమని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ( Nitish Kumar ) తనదైన రీతిలో స్పందించారు. లాలూ ప్రసాద్ ప్రకటనపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘అతను నన్ను కాల్చేయవచ్చు. అంతకుమించి అతను ఇంకేమీ చేయలేడు. అతను నన్ను కాల్చాలనుకుంటే కాల్చేయవచ్చు’ అని నవ్వుతూ నితీశ్ కుమార్ చమత్కరించారు.
బీహార్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అభ్యర్థుల తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం, నితీశ్ కుమార్ తొలగింపు ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మీడియా నితీశ్కుమార్ ముందు ప్రస్తావించడంతో ఆయన పైవిధంగా స్పందించారు.