పాట్నా: బీహార్లో బీజేపీ సహకారంతో సీఎం పదవి చేపట్టిన జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, బీజేపీకి చెందిన స్పీకర్కు తలొగ్గారు. చివరకు లఖిసరాయ్కు కొత్త డీఎస్పీని నియమించారు. లఖిసరాయ్లో ఇటీవల సరస్వతి పూజ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. దీనికి వేలాదిగా ప్రజలు హాజరయ్యారు. అయితే కరోనా నియమాల ఉల్లంఘనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇద్దరు బీజేపీ మద్దతుదారులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే నిర్వాహకులు, కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
మరోవైపు లఖిసరాయ్ బీజేపీ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన విజయ్ కుమార్ సిన్హా దీనిపై మండిపడ్డారు. బీజేపీ వ్యక్తుల అరెస్ట్ను లేవనెత్తిన తనపై డీఎస్పీ రంజన్ కుమార్, పోలీస్ అధికారులు దిలీప్ కుమార్ సింగ్, సంజయ్ కుమార్ సింగ్ దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేసిన ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని హోం శాఖను కూడా చూస్తున్న సీఎం నితీశ్ కుమార్ను ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ఈ నెల 14న బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బీజేపీ మద్దతుదారుల అరెస్ట్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తారు. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా మాటను లెక్కచేయని పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ ఈ అంశాన్ని బుధవారానికి రీ షెడ్యూల్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ సభలోనే స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై మండిపడ్డారు.
సీఎం నితీశ్ తీరుపై కలత చెందిన స్పీకర్ సిన్హా, ముంగళవారం స్పీకర్ కుర్చీలో కూర్చోలేదు. దీంతో బుధవారం సమావేశాలకు ఆయన గైర్హాజరవుతారన్న వదంతులు వెలువడ్డాయి. అయితే బీజేపీ అధిష్ఠానం జోక్యంతో మంగళవారం సాయంత్రం నితీశ్, సిన్హా సమావేశమయ్యారు. తమ మధ్య నెలకొన్న విభేదాలను ఈ సందర్శంగా వారిద్దరూ పరిష్కరించుకున్నారు. దీంతో బుధవారం అసెంబ్లీకి హాజరైన స్పీకర్ సిన్హా, సభలో జరిగిన ఘటన చీకటి చాప్టర్ అని, అది ముగిసిపోయిందని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ఆ ముగ్గురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. శుక్రవారం హోలీ నేపథ్యంలో సెలవు అయినప్పటికీ లఖిసరాయ్ కొత్త డీఎస్పీగా సయ్యద్ ఇమ్రాన్ మసూద్ను నియమించారు. దీంతో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పంతం నెగ్గించుకోవడంలో విజయం సాధించారు.