పాట్నా: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలు తీవ్ర స్థాయిలో ప్రారంభమైన బీహార్లో శనివారం బంద్కు పిలుపునిచ్చారు. ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఈ బంద్కు మద్దతిచ్చింది. ఈ బంద్ ప్రధానంగా ప్రజా రవాణాపై ప్రభావం చూపనున్నది. రైలు, బస్సు సేవలకు ఆటంకం కలిగే అవకాశముంది. మార్కెట్లు, సంతలతోపాటు షాపులు మూతపడనున్నాయి.
కాగా, అగ్నిపథ్కు వ్యతిరేకంగా బీహార్లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీ కారణమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఆ పార్టీ దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని విమర్శించారు. అలాగే నిరసనల్లో పాల్గొనే వారిలో విద్యార్థులు కాని వారిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
‘ప్రజా ఆస్తులను తగలబెట్టే ఆర్జేడీ ఆగ్రహ నిరసనలలో బీహారీలు చనిపోతున్నారు. బీహార్కు ఆర్జేడీ సమాధానం చెప్పాలి’ అని బెగుసరాయ్ ఎంపీ అయిన గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. సాయుధ బలగాల కోసం తెచ్చిన కొత్త రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్ను ఆయన గట్టిగా సమర్థించారు. నాలుగేళ్ల తర్వాత డిశ్చార్జ్ అయిన యువకులు కొత్త ఉద్యోగాలు పొందడంలో నైపుణ్యం కలిగి ఉంటారని అన్నారు.