చండీగఢ్: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళన నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వోద్యోగులను బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ మేరకు సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ అధ్యక్షతన శుక్రవారం కోవిడ్-19 పరిస్థితిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని వారికి మినహాయింపునిచ్చారు.
కనీసం 4 వారాల ముందు వ్యాక్సిన్ వేసుకున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్నే విద్యా సంస్థలకు అనుమతినిస్తూ సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో వారానికొక సారి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సిబ్బంది పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకుంటేనే అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతినిస్తూ పంజాబ్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.