డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్నా.. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న పుష్కర్ సింగ్ ధామి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కప్రీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. భువన్ చంద్ కప్రీ.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీపై 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖతిమా నియోజకవర్గంలో 91,325 ఓట్లు పోలవగా.. పుష్కర్ సింగ్ ధామికి 40,675, కాంగ్రెస్ అభ్యర్థి భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో.. బీజేపీ పార్టీ 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఉత్తరాఖండ్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు అవసరం కాగా.. 48 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇతర పార్టీలకు చెందిన నలుగురు లీడ్లో ఉన్నారు.