బెంగళూరు: బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సంచలన ప్రకటన చేశారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ సీటును తన కొడుకు బీవై విజయేంద్రకు వదులుకుంటున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కొడుకు పోటీ చేస్తాడని యడ్యూరప్ప వెల్లడించారు.
‘నా కొడుకు బీవై విజయేంద్ర కోసం నేను నా అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదులుకుంటున్నాను. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని శికారిపుర ఓటర్లను అభ్యర్థిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను’ అని బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. దక్షిణాదిలో అధికారంలో ఉన్న పార్టీలో తనను పక్కన పెట్టారనే వాదనలను ఖండించిన ఒక రోజు తర్వాత యడ్యూరప్ప ఈ సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి రానివ్వబోమని ఆయన పేర్కొన్నారు.