న్యూఢిల్లీ: బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ‘భారత్ రైస్’ పథకాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ సోమవారం ప్రకటించింది. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో నేడు పథకాన్ని ప్రారంభిస్తారని సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం, సబ్సిడీ రేటు బియ్యాన్ని ‘భారత్’ బ్రాండ్ పేరుతో కేంద్రం అమ్మకాలు చేపట్టింది. కిలో భారత్ బ్రాండ్ రైస్ను రూ.29కే అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తెలిపింది. భారత్ ఆటా , భారత్ దాల్ను విక్రయిస్తున్న ఏజెన్సీలతో పాటు ఈ-కామర్స్ వెబ్సైట్లలోనూ బియ్యం అమ్మకాలుంటాయని తెలిపింది.