Rahul Gandhi | ఇప్పుడు ‘భారత్మాత’ అనే పదం అన్ పార్లమెంటరీ పదంగా భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై బుధవారం చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొంత భాగం రికార్డులను తొలగిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీనిపై గురువారం మీడియా అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్ మాత అంటే `అన్ పార్లమెంటరీ పదం’గా కనిపిస్తున్నట్లు ఉందని చెప్పారు.
మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వక ముందే లోక్ సభ నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చారు. తనకు కొంత పని ఉందని, అందువల్లే బయటకు వచ్చానని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ ‘భారత్ మాత’ అనే అంశంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లా బుధవారం రాత్రి అధికారులను ఆదేశించారు.