చండీగఢ్: రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే ‘భారత్ బంద్’కు కొన్ని గంటల ముందు ఆయన బలవన్మరణం చెందాడు. లుధియానాలోని నిరసన ప్రాంతానికి సమీపంలో మెడలో వేసుకున్ని కండువాతో ఒక పైప్కు ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం రైతులు ఈ విషయాన్ని గమనించారు. కాగా, మరణించిన రైతు భార్య కూడా ఢిల్లీ సరిహద్దులోని టిక్రి వద్ద గత పది నెలలుగా నిరసన తెలుపుతున్నది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు సోమవారం పది గంటలపాటు ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్య, ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను మూసివేయాని డిమాండ్ చేశారు.
అయితే ఆసుపత్రులు, మెడికల్ స్టోర్స్, రిలీఫ్, రెస్క్యూ వర్క్, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు హాజరయ్యే వ్యక్తులతో సహా అన్ని అత్యవసర సంస్థలు, సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు
సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.