న్యూఢిల్లీ: ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. రైతు ధర్నాలతో హోరెత్తిన ఆ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారన్నదే కీలకం. అయితే పంజాబ్లో ఇప్పటికే పలు పార్టీలు వ్యూహాత్మక పావులు కదుపుతున్నాయి. సిద్దూతో ఏర్పడిన వైరం వల్ల కాంగ్రెస్ పార్టీని వీడిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించారు. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన ఎన్నికల హామీలతో పంజాబ్లోనూ దూసుకెళ్లుతోంది. ఇటీవల చంఢీఘడ్ లోకల్ పోల్స్లో సంచలన విక్టరీ కొట్టింది. ఇక త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆప్ తన రంగాన్ని సిద్ధం చేసింది. ఆ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ నిలబడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్ర ఆప్ పార్టీ చీఫ్గా ఉన్న సంగ్రూర్ ఎంపీనే సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్సు ఉంది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు కరోనా సోకడం వల్ల .. పంజాబ్ సీఎం అభ్యర్థి ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ సీనియర్ బీజేపీ నేత తనకు భారీ ఆఫర్ ఇచ్చారని, ఆ పార్టీలో చేరాలంటూ ఆయన కోరాడని డిసెంబర్లో భగవంత్ మాన్ సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లోని 117 సీట్లలో 20 స్థానాలను గెలిచింది.