కెనడా, థాయిలాండ్, వియత్నాం, ఇటలీ, భూటాన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, బ్రిటన్, అమెరికాలో ఇప్పటికే టీకా మిక్సింగ్ను వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్నారు.
రూపుమార్చుకొని బుసలు కొడుతున్న కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయడానికి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా భిన్న రకాల టీకాలను (వ్యాక్సిన్ మిక్సింగ్-మ్యాచింగ్) ఇచ్చే విధానంపై పలు దేశాల్లో ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ‘టీకా మిక్సింగ్’పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్వైరాలజీ (ఎన్ఐవీ), పుణె తాజాగా చేసిన పరిశోధన ఫలితాలు ఊరట కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వినియోగిస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ (విదేశాల్లో ఆస్ట్రాజెనెకా) టీకాలను వేర్వేరుగా ఒక్కో డోసు చొప్పున తీసుకోవడం సురక్షితమేనని ఐసీఎంఆర్-ఎన్ఐవీ అధ్యయనం వెల్లడించింది. ఒకే రకమైన టీకా రెండు డోసులను తీసుకోవడంతో ఏర్పడిన రోగనిరోధకశక్తితో (యాంటీబాడీల ఉత్పత్తి) పోలిస్తే, రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకోవడంతో రోగనిరోధకశక్తి మరింత ఎక్కువగా పెంపొందుతున్నట్టు వివరించింది. ఆల్ఫా, బీటా, డెల్టా వంటి వేరియంట్లపై ఈ టీకా మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు పేర్కొంది. ఈ వివరాలు ప్రీ-ప్రింట్ సర్వర్ ‘మెడ్ఆర్ఎక్స్ఐవీ’లో ప్రచురితమయ్యాయి. అయితే, ఈ అధ్యయనాన్ని సమీక్షించాల్సి ఉన్నది. కాగా, కొవాగ్జిన్ టీకాను ఇన్యాక్టివేటెడ్ వైరస్ను ఉపయోగించి, కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ఎడినో వైరస్ వెక్టార్ సాంకేతికత సాయంతో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.
అధ్యయనానికి బీజం పడిందిక్కడ!
వ్యాక్సిన్ మిక్సింగ్పై వివిధ దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ, మన దగ్గర ఈ తరహా ప్రయోగం చేయడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణమయ్యాయనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ్నగర్లోని ఓ టీకా కేంద్రంలో 18 మందికి తొలి దఫాలో కొవిషీల్డ్ టీకా వేయగా, రెండో దఫాలో ఇటీవల కొవాగ్జిన్ టీకాను పొరపాటున వేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, వేర్వేరు టీకా డోసులను తీసుకున్న వీరిలో వ్యాక్సిన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొన్నది. దీంతో ఐసీఎంఆర్-ఎన్ఐవీకి చెందిన నిపుణుల బృందం వీరిపై అధ్యయనం చేయాలనుకున్నది. ఈ క్రమంలో కొవాగ్జిన్ రెండు టీకా డోసులు వేసుకున్న 40 మందిని, కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్న మరో 40 మందితో పాటు కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఒక్కొక్క టీకా డోసు చొప్పున వేసుకున్న ఈ 18 మందిపై మే, జూన్, 2021లో అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో మిగతా 80 మందితో పోలిస్తే మిక్సింగ్ టీకా తీసుకున్న 18 మందిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా వృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు. దుష్ప్రభావాలు కూడా దాదాపుగా లేవన్నారు.
లాభాలు కూడా ఉన్నాయి
టీకా మిక్సింగ్తో కొన్ని లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక కంపెనీకి చెందిన టీకా అందుబాటులో లేని సమయంలో రెండో డోసుగా వేరే సంస్థ టీకాను వేసుకోవచ్చు. దీంతో టీకా ప్రక్రియలో జాప్యాన్ని నివారించవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగాల్సిన అవసరమున్నదని, మిక్సింగ్ టీకాతో అది మరింత సులభమవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.