బెంగళూరు : పశ్చిమాసియాలో ఘర్షణలు రెస్టారెంట్ల యజమానులతోపాటు కుటుంబాల్లో కూడా కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడుతున్న కొన్ని అవాంతరాలే వారి ఆందోళనకు కారణం. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో తాత్కాలికంగా చాలా హోటళ్లు మూతపడనున్నట్లు బెంగళూరులోని హోటళ్ల యజమానులు సోమవారం తెలియచేశారు. సోమవారం ఉదయం తమకు ఎల్పీజీ సిలిండర్ సరఫరా ఆగిపోయినట్లు వారు చెప్పారు.
విద్యార్థులు, డ్రైవర్లు, బ్రహ్మచారులు, వృద్ధులు, ఇంకా అనేకమందికి ఆహారాన్ని అందచేసే హోటళ్లు కూడా అత్యవసర సర్వీసులుగానే పరిగణించాలని, సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్కు చెందిన పీసీ రావు తెలిపారు. గత కొన్ని రోజులు గృహ వినియోగదారుల నుంచి వంటగ్యాస్ బుకింగ్ పెరిగిపోయినట్లు గ్యాస్ ఏజెన్సీలు గుర్తించాయి. తమ బుకింగ్లను అనుమతించడం లేదని పలువురు గృహ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.