బెంగళూరు, జూలై 28: అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (ఐఎంవో)లో మూడు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా బెంగళూరు బాలుడు ప్రాంజల్ శ్రీవాస్తవ రికార్డు సృష్టించాడు. నార్వేలోని ఓస్లోలో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ఐఎంవోలో శ్రీవాస్తవ అద్భుత ప్రతిభ కనబర్చాడు. 63 ఏండ్ల ఐఎంవో చరిత్రలో ఇతడి కంటే ఎక్కువ పతకాలు సాధించినవారు కేవలం 11 మందే. ఒకటో తరగతి నుంచే గణితంపై ఉన్న తన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆ సబ్జెక్టులో ప్రోత్సహించారని శ్రీవాస్తవ తెలిపారు. అతడి తల్లిదండ్రులు ఐటీ నిపుణులుగా పనిచేస్తున్నారు.