కోల్కతా: పశ్చిమబెంగాల్ టీచర్ల నియామక కుంభకోణంలో అధికార పార్టీ నాయకుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఉద్యోగాల పేరుతో భారీగా వెనకేసున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ యువజన నాయకుడు కుంతల్ ఘోష్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. హుగ్లీ లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి 2021 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల పేరుతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఈ కుంభకోణంలో ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన ఇంట్లో గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు లభించిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో ప్రైవేటు కాలేజీలు, విద్యా సంస్థల అధ్యక్షుడు తపాస్ మండల్ను సీబీఐ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా కుంతల్ ఘోష్ రూ.19.5 కోట్లు వసూళ్లు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు అతని ఇంటిపై దాడులు నిర్వహిస్తున్నారు.